Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్కు సర్వంసిద్ధం
Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇవాళ, రేపు ఈ సదస్సు జరగనుంది.
Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్కు సర్వంసిద్ధం
Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇవాళ, రేపు ఈ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబయ్యింది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 600 మంది వీఐపీలు, 15వందల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్లో ఇంటర్నేషనల్ ఆర్థికవేత్తలు ప్రసంగిస్తారు. మొదటిరోజు నోబెల్ పురస్కార గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాశ్ సత్యార్థి, డైరెక్టర్ ఆఫ్ ట్రంప్- మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూపు నుంచి ఎరిక్ స్వీడర్ ప్రసంగిస్తారు. వీరితో పాటు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రసంగించనున్నారు.
ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో చర్చాగోష్టులు జరుగుతాయి. రేపు ఉదయం 9 గంటలకు మళ్లీ చర్చా గోష్టులు తిరిగి ప్రారంభమవుతాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో భాగంగా రూపొందించిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047ను ఆవిష్కరించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల నుంచి నేతలను ఈ సదస్సుకు ఆహ్వానించింది కాంగ్రెస్ ప్రభుత్వం.