Breaking: మార్చి 31వ వరకూ తెలంగాణ లాక్డౌన్.. బియ్యంతో పాటు 1500 నగదు..
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు చూపించిన పట్టుదల ఈ నెల 31వ తేదీ వరకూ చూపించాలని ఆయన అన్నారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇంటి అవసరాల కోసం కావాల్సిన పాలు, కూరగాయలు కోసం మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు నెలరోజులకు సరిపడా రేషన్ బియ్యం ఇస్తాం. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి ఒక్కరికి ఉచితంగా 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని తెలిపారు కేసీఆర్.
లాక్డౌన్ కాలంలో బియ్యంతో పాటు ప్రతి రేషన్కార్డుదారుకు రూ.1,500 ఇస్తామని వెల్లడించారు. అందుకోసం రూ.1314 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆయా సంస్థలు వారం రోజుల వేతనాన్ని చెల్లించాలని సూచించారు. ప్రజారవాణా కూడా అందుబాటులో ఉండదని.. బస్సులు, క్యాబ్లు, ఆటోలు ఏవీ నడవబోవని ప్రకటించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తామని కేసీఆర్ వెల్లడించారు. రోడ్లుపై ఐదుగురికి మించి ఎవరూ గుమికూడవద్దని.. సరుకుల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.