TS Congress: అధికారంలో ఉండటంతో లోక్సభ స్థానాలపై హస్తం ఫోకస్
TS Congress: ఆరుగురి పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీకి పంపిన జిల్లా కాంగ్రెస్ కమిటీ
TS Congress: అధికారంలో ఉండటంతో లోక్సభ స్థానాలపై హస్తం ఫోకస్
TS Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ టికెట్ కోసం పోటీచేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మరోవైపు తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా హస్తం నేతలు సైతం గెలుపు గుర్రాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిష్ఠానం మెప్పు కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరే.... లోక్సభ టికెట్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది.
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీకి పలువురు కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నర్సారెడ్డి, ఆకుల లలిత, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్లు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీకి ఇప్పటికే జిల్లా నుంచి ఆరుగురి ఆశావహుల పేర్లు వెళ్లినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలువురు ప్రముఖుల పేర్లతో పాటు సినీ నిర్మాత దిల్ రాజు పేరు సైతం తెరపైకి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో కాంగ్రెస్ నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడ్డాక అత్యధికంగా హస్తం పార్టీ నేతలే విజయం సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ , బీజేపీ , స్వతంత్ర్య అభ్యర్థలు ఒక్కోసారి ప్రాతినిధ్యం వహించారు. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది.
ఉత్తర తెలంగాణాలో బీఆర్ఎస్ , బీజేపీ బలపడిన తర్వాత ఇక్కడ త్రిముఖ పోరు అనివార్యంగా మారింది. గత ఎన్నిక అనుభవం దృష్ట్యా కాంగ్రెస్ గెలుపు అవకాశాలున్న అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చినా... గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.