ఏపీ సరిహద్దు గ్రామాలతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కెసిఆర్

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Update: 2020-05-06 15:18 GMT
KCR (File Photo)

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ అమలు, సహాయక చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతా కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు, గుంటూరు సరిహద్దు గ్రామాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని కేసీఆర్‌ తెలిపారు. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే వస్తున్నాయని కేసిఆర్ అన్నారు. అధికారులు హైదరాబాద్ నగరంపై దృష్టి సారించాలని, వ్యాధి లక్షణాలు ఎవరిలోనైనా కనిపించినా వెంటనే పరీక్షలు చేయించాలని ఆదేశించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆ వ్యక్తికి చికిత్స అందించాలని, అతనితో కాంటాక్ట్‌లను క్వారంటైన్ చేయాలని చెప్పారు. హైదరాబాద్‌కు చెందినవారు బయటకు వెళ్లకుండా, బయటివారు రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

Tags:    

Similar News