Praja Sangrama Yatra - BJP: చివరి దశకు టీ.బీజేపీ చీఫ్‌ ప్రజాసంగ్రామ యాత్ర

Praja Sangrama Yatra - BJP: *నేడు హుస్నాబాద్‌లో ముగింపు సభ *సభకు హాజరుకానున్న బీజేపీ జాతీయ నేతలు

Update: 2021-10-02 01:36 GMT

చివరి దశకు టీ.బీజేపీ చీఫ్‌ ప్రజాసంగ్రామ యాత్ర

Praja Sangrama Yatra - BJP: ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు కమలం పార్టీ సర్వం సిద్ధం చేసింది. మొదటి దశ సంగ్రామ పాదయాత్ర సభకు హుస్నాబాద్ వేదికైంది. లక్ష మందితో భారీ సభకు కమలం నేతలు ఏర్పాట్లు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముగింపు సభను కమలనాథులు తీసుకున్నారు. ఇక్కడ నుంచే హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు అనివార్యతను ప్రజలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ వివరించనున్నారు.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ నేటితో ముగియనుంది. ఆగస్టు 28న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన పాదయాత్ర గాంధీ జయంతి సందర్భంగా ముగించబోతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రోడ్ షో, బహిరంగ సభతో తొలిదశ పాదయాత్ర ముగియనుంది. పాదయాత్రలో బండి సంజయ్ మొత్తం 438కిలోమీటర్లు నడిచారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు... 8 జిల్లాలను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ కవర్ చేశారు.

మరోవైపు ఇవాళ హుస్నాబాద్‌లో జరగనున్న రోడ్ షో, బహిరంగ సభను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. లక్ష మందితో సభను విజయవంతం చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. సభకు జాతీయ నాయకులను ఆహ్వానించారు. ఇవాళ జరగనున్న కార్యక్రమానికి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పాల్గొంటారు.‌ ఈ సభ ప్రభావం హుజురాబాద్ ఎన్నికలపై పడే విధంగా వ్యూహం రచించారు. అలాగే ఈటల రాజేందర్ గెలుపు కోసం ఎలాంటి సంకేతాలు పంపించాలి, ఎలా వ్యవహరించాలన్న విషయంపై రాష్ట్ర స్థాయి నాయకులు ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారు. మొత్తానికి హుస్నాబాద్ సభ ద్వారా హుజురాబాద్ ఉప ఎన్నిన శంఖారావాన్ని బీజేపీ పూరించనుంది.

Tags:    

Similar News