ఇవాళ (శనివారం) స్థానిక పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నాగిరెడ్డి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన 4 మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లకు నిన్న గెజిట్ జారీ కావడంతో.. షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమమైంది. మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి మే 14లోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగించేలా ముసాయిదా షెడ్యూల్ను ఎస్ఈసీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
మూడు విడతల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. 26 జిల్లాల్లో మూడు విడతల్లో, ఐదు జిల్లాల్లో 2 దశల్లో, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లు ఈ నెల 22, 26, 30 తేదీల్లో విడుదల కానున్నాయి. తొలి విడత ఎన్నికలు మే 6, రెండో విడత 10న, తుది విడత ఎన్నికలు 14న జరగనున్నాయి. మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఎంపీపీ, జెడ్పి చైర్మన్ల ఎన్నిక ఉంటుంది.