నేను పీహెచ్డీ చేశా.. రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంపత్కుమార్
మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్పై యురేనియం విషయంలో ఏబీసీడీలు రావని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అయితే రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే సంపత్. తాను చదువులో పీహెచ్డీ చేశానని, ఆ విషయం ప్రజలకు బాగా తెలుసని ఆయన సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్పై యురేనియం విషయంలో ఏబీసీడీలు రావని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అయితే రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే సంపత్. తాను చదువులో పీహెచ్డీ చేశానని, ఆ విషయం ప్రజలకు బాగా తెలుసని ఆయన సమాధానమిచ్చారు. సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారని ఎద్దేవా చేశారు. కేవలం జనసేన బ్యానర్ పైన అఖిలపక్షం భేటీ జరగడం సరికాదు. కనీసం సర్పంచ్ కూడా లేనటువంటి పార్టీ జనసేన. యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, వంశీచందర్, తనకు మాత్రమే ఆహ్వానం ఉందని, రేవంత్కు లేదని తెలిపారు.
యురేనియంపైన కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం అంతా జనసేన పార్టీకి క్రెడిట్ వెళ్ళిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంటే చుస్తూ ఉరుకోనని స్పష్టం చేశారు. యురేనియం ఉద్యమ క్రెడిట్ వేరే పార్టీకి ఇవ్వొద్దు. రేపు పవన్ కల్యాణ్ యురేనియం పైన మళ్ళీ సమావేశం పెడితే వెళ్తా.. కానీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటీ అనేది ముందే పార్టీలో చర్చ జరగాలన్నారు. పీసీసీ అధ్యక్షుడి పదవికి తన పేరు ప్రతిపాదిస్తే కొనసాగుతానని వ్యాఖ్యానించారు.