అందరూ ఉన్నా.. అనాథ శవంగానే ఆఖరి మజిలీ.. తల్లి మరణంతో అనాథలుగా చిన్నారులు
ఆకలితో ఉన్న వారికి ఆపన్న హస్తం ఇస్తూ మంచి మనసు చాటుకుంటున్నా.... మనుషుల్లో మానవత్వం ఉందా అని ప్రశ్నించే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఓ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ మహిళను అయిన వారెవరూ పట్టించుకోలేదు. చుట్టుపక్కల వారు కనీసం కన్నెత్తి చూడలేదు. చివరకు అన్నీ తామై అంత్యక్రియలు చేశారు మున్సిపల్ సిబ్బంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవింద పల్లె ప్రాంతానికి చెందిన ఓ మహిళ టీబీ వ్యాధితో చనిపోయింది. భర్తను కోల్పోయిన ఆమె పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలకోర్చి జీవనం సాగిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఎప్పుడో అయిన వారికి దూరమైన ఆ మహిళ చనిపోయాక అంత్యక్రియలకు చుట్టుపక్కల వారి సాయాన్ని కూడా నోచుకోలేకపోయింది.
అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవటంతో స్థానిక అంగన్ వాడీ సిబ్బంది సమాచారంతో వచ్చిన మున్సిపల్ కార్మికులే అంత్యక్రియలు పూర్తి చేశారు. గతంలో తండ్రిని కోల్పోయిన పిల్లలకు ఒకే ఒక్క ఆధారమైన తల్లి కూడా చనిపోవటంతో అనాధలుగా మారారు పిల్లలు. వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులు పిల్లలను స్వధార్ ఆశ్రమంలో చేర్పించారు. వారికి స్వయం ఉపాధిపై శిక్షణ ఇస్తామని తెలిపారు.