పూడ్చిన శవానికి పోస్టుమార్టం..కారణం ఏంటంటే?
రెండు రోజుల క్రితం మరణించిన మహిళలకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వ అధికారులు పూడ్చిన శవాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు.
రెండు రోజుల క్రితం మరణించిన మహిళలకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వ అధికారులు పూడ్చిన శవాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. కామారెడ్డి మండలంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది, ఎందుకు పూడ్చిన శవాన్ని తీసి పోస్టుమార్టం చేసారు అన్న సందేహాలు గ్రామస్థులకు కలుగుతున్నాయి. కాగా దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల్లోకెళితే కామారెడ్డి మండలం తిమ్మక్పల్లి (కే) గ్రామానికి చెందిన కొలిమి భూపాల్కు, మేన మరదళ్లు శ్రీలత, మౌనిక(25)తో 2017లో వివాహం జరిగింది. వారిలో శ్రీలత దివ్యాంగురాలు ( పుట్టు మూగ) కాగా ఆమెకు ఇద్దరు పిల్లలు. కాగా వారందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.
వివాహం జరిగిన ఇన్ని ఏండ్లవరకూ భాగానే ఉన్న వారి కుంటుంబంలో కొంత కాలంగా కలహాలు మొదలయ్యాయి. ప్రతి రోజూ ఏదో ఒక గొడవ జరుగుతుండేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మౌనిక అనారోగ్యం పాలయిందని ఈ నెల 15వ తేదీన ఆమెను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా మూడు రోజుల తరువాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న ఆమె 20వ తేదీన మృతి చెందింది. కాగా ఆమె కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మృతురాలి తండ్రి తన కూతురు అనారోగ్యంతో చనిపోలేదనిచ తన భర్త కొట్టడంతోనే చనిపోయిందని పోలీస్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసారు.
ఫిర్యాదును అందుకున్న పోలీసులు వెంటనే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేయడంతో బుధవారం రోజున అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ అమీన్సింగ్, రూరల్ సీఐ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మృతురాలి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులను, గ్రామస్థులను విచారించారు. వారు చెప్పిన పూర్తివివరాలను సేకరించి, మృతురాలి అంత్యక్రియలను నిర్వహించిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఆమె శవాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. కాగా విషయం తెలుకున్న మృతురాలి భర్త భూపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.