భక్తితో ఆలయానికి వస్తారు. కోరిన కోర్కెలు తీరాలని మొక్కుకుంటారు. తమ కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకుంటారు. ప్రశాంతతకు నిలయమైన కోవెల రణరంగంగా మారింది.
మేడారం సమ్మక్క జాతరకు ముందు భక్తులు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. సమ్మక్క జాతరకు ముందు నెల రోజుల నుండి తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి రాజన్నను దర్శించుకుంటారు భక్తులు. రాజన్నకు భక్తితో కోడె మొక్కలు సమర్పించుకుంటారు. సమ్మక్క జాతర నేపథ్యంలో వేములవాడకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 24 గంటల పాటు దర్శనం చేయించినా భక్తుల రష్ తగ్గడం లేదు.
భక్తులను కంట్రోల్ చేయలేక ఆలయ సిబ్బంది చేతులెత్తేశారు. విపరీతమైన రద్దీతో భక్తులు సహనం కోల్పోతున్నారు. ఆలయ ఆవరణలో భక్తులు పరస్పర దాడికి దిగారు. సుమారు 15 నిమిషాల పాటు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో దాడిని నియంత్రించే వారే లేకపోయారు.