తెలంగాణ కేంద్ర బడ్జెట్పై చాలానే ఆశలు పెట్టుకుంది. విభజన హామీలు, కాశేశ్వరానికి జాతీయ హోదా, పన్నుల ఆదాయం పెంపుతో పాటుతో చాలా అంశాలపై గతంలోనే చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేకుంటే సర్కార్తో లడాయేనంటూ సవాల్ విసిరినా మోడీ టీమ్ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు.
కేంద్ర బడ్జెట్పై తెలంగాణ పెదవి విరుస్తోంది. బడ్జెట్ తమను నిరుత్సాహపరిచిందని విమర్శిస్తోంది. కేవలం ఐఐటీ హైదరాబాద్కు 80 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకుందని దుమ్మెత్తిపోస్తోంది. కేంద్ర బడ్జెట్తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తాము భావించడం లేదంటున్న కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ రంగానికి పెద్దగా కేటాయింపులు జరగలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పెంపు సామాన్యులపై భారంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామనడం తప్ప అందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పలేదన్నారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
తెలంగాణ స్వరాష్ట్ర హోదా సంపాదించుకున్న తర్వాత రాష్ట్రానికి దక్కిన ప్రయోజనం మాత్రం పెద్దగా లేదన్నది టీఆర్ఎస్ సర్కార్ వాదన. విభజన సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవటం, బయ్యారం ఉక్కు కర్మాగారం, విశ్వవిద్యాలయాల ఏర్పాటు హామీలు నెరవేరకపోవటం, కేంద్ర పథకాలకు నిధులు సక్రమంగా రావడం లేదంటోంది. గతంలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినపుడు హామీలు వచ్చినా ఆశించిన స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు జరగలేదంటోంది.
జాతీయ ప్రాజెక్టు హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా నిధుల వరద పారిచాలని కోరినా దాని ప్రస్తావన లేదంటోంది తెలంగాణ. ధనిక రాష్ట్రాల సాకుతో తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చాలా జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా ప్రకటించి బడ్జెట్లో నిధులివ్వాలని కోరినా పట్టించుకోలేదని టీఆర్ఎస్ వాపోతోంది. చాలా డిమాండ్స్ను కేంద్రం ముందు పెట్టినా కేంద్రం పెడచెవిన పెట్టడంపై మండిపడుతోంది.