కరోనావైరస్ వ్యాప్తి, లాక్డౌన్ అమలుతో నిలిచిన పసుపు కొనుగోళ్లు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 60 రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మార్కెట్ సందడిగా మారింది. మార్చి 18వ తేదీ నుంచి మార్కెట్యార్డు మూసివేయడంతో కోల్డ్ స్టోరేజీలు, గోదాముల్లో రైతులు పసుపు నిల్వ చేశారు. మరికొందరు ఇండ్లల్లోనే ఉంచారు.
ఎట్టకేలకు కొనుగోళ్లు ప్రారంభం కావడంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాల రైతులకు మార్కెట్ యార్డులోకి అనుమతిని అధికారులు నిరాకరించారు. అలాగే ప్రతిరోజు 10వేల బస్తాలు మాత్రమే మార్కెట్లోకి అనుమతివ్వనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే కొనుగోళ్లు జరుగనున్నాయి.