Nirmal: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ ముషారఫ్
నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు.
నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. వైద్యులు ఆస్పత్రికి వచ్చి పోయే సమయాన్ని అడిగి తెలుసుకున్నారు. హెల్ప్డెస్క్ వద్ద గర్భిణులకు తీసుకు వచ్చే ఆశావర్కర్ల పూర్తి వివరాలను, డెలివరీ రిజస్టర్, గర్భినీ స్త్రీలకు సంబంధించిన వారి పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని, అందుకు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
అనంతరం ఆస్పత్రిలో అన్ని వార్డులను తిరుగుతూ పరిశీలించారు. అక్కడ ఉన్న బాలింతలను, గర్భిణులతో మాట్లాడి వైద్యం సరిగ్గా అందుతుందా లేదా అన్ని విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భినీలకు, బాలింతలకు, పసి పిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రతినెలా 300 ప్రసవాలు జరగాలని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. గర్భినీలు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ తనిఖీల్లో కలెక్టర్తో పాటు డాక్టర్ రజిని, మున్సిపల్ కమిషనర్ ఎన్. బాలకృష్ణ, తహసీల్దార్ సుభాష్ చందర్, మున్సిపల్ డీఈ సంతోష్ కుమార్, కౌన్సిలర్ మహమ్మద్ సలీం ఉన్నారు.