Nayee Brahmins on Salon Shop in Warangal: కరోనా భయంతో సెలూన్లకు రాని జనం

Update: 2020-06-29 06:57 GMT

Nayee Brahmins on Salon Shop in Warangal: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వ్యాప్తి కులవృత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా ధాటికి కులవృత్తినే నమ్ముకొని బతుకు బండిని లాగుతోన్న నాయిబ్రాహ్మణులు కుదేలవుతున్నారు. సెలూన్ షాపుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్న ప్రచారంతో గిరాకీ లేక కుటుంబ పోషణ భారమై విలవిలాడుతున్నారు. సెలూన్ల షాపులపై దుష్ప్రచారాలను ఆపాలంటూ నిరసన వ్యక్తం చెస్తున్న నాయిబ్రాహ్మణుల వెతలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.

కరోనా ధాటికి కుటుంబ పోషణ దుర్భరంగా మారిన నాయిబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని వరంగల్ సెలూన్ షాపుల నిర్వాహకులు కోరుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు సెలూన్లలో గిరాకీలు లేక ఇంటి అద్దె, షాపు కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో గత నాలుగు రోజులుగా నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా షాపులను మూసివేసి నిరసన తెలుపుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు నాయిబ్రాహ్మణులు.

మరోవైపు షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సెలూన్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందన్న దుష్ప్రచారంతో ఎవరూ షాపులకు రావట్లేదని వాపోతున్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందనే అపోహను ప్రభుత్వం చెదరగొట్టినట్లే సెలూన్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందదనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని వేడుకుంటున్నారు. కరోనా ప్రభావంతో జీవనం దుర్భర స్థితికి చేరుకుందని రెక్కాడితే కాని డొక్కాడని తమ జీవితాలను మానవతాధృక్పథంతో ఆదుకోవాలని సెలూన్లపై దుష్ప్రచారాలను అరికట్టాలని కోరుతున్నా నాయిబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆశిద్దాం.


Full View


Tags:    

Similar News