భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన సూర్యాపేటకు బయల్దేరిన జగదీశ్రెడ్డి.. సంతోష్ బాబు తల్లిదండ్రులను కలిశారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా వారికి తెలియజేశారు. వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఉన్నారు. కర్నల్ సంతోష్ తల్లిదండ్రులను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఫోన్లో పరామర్శించారు.