శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భద్రాద్రి రామయ్య కళ్యాణ ఉత్సవాలు భద్రాచలంలోని ఏప్రిల్ 2వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
భద్రాద్రి రామయ్య కళ్యాణ ఉత్సవాలు భద్రాచలంలోని ఏప్రిల్ 2వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అరణ్య భవన్ లోని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏప్రిల్ 1న ఎదుర్కోలు ఉత్సవం, 2 కళ్యాణ మహోత్సవం, 3న మహా పట్టాభిషేకం ఉంటుందని ఆలయ అధికారులు వివరించారు. ఇందుకు గాను కట్టుదిట్టమైన అన్ని భద్రతా ఏర్పాట్లను చేయాలని చెప్పారు. స్వామి వారి కళ్యానోత్సవం వైభవోపేతంగా నిర్వహించాలని, అధికారులు దానికి సన్నద్ధం కావాలని తెలుపుతున్నారు.
ఈ నెల 25వ తేది నుంచి ఏప్రిల్ 8వ తేది వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. ఉత్సవాల సమయంలో వాహనాల పార్కింగ్ ప్రధాన సమస్యగా ఉంటుందని తెలిపారు. అలాంటి ఇబ్బందులను తొలగించాలని అందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని సూచించారు.
మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేయాలని, భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం, జిల్లా పోలీసులు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, ఈవో నర్సింహులు, ఇతర అధికారులు హాజరయ్యారు.