తెలంగాణలో కరోనా దూకుడు కలవరపెడుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. GHMCలో ప్రతి రోజూ వంద మందికి పైగా కోవిడ్ బారిన పడుతుంటంతో కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యూహం మార్చింది. సరికొత్త ఎత్తుగడతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది.
కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పరీక్షలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తోపాటు చుట్టూ ఉన్న 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వైద్యారోగ్యశాఖ కోవిడ్ టెస్టులను విస్తృతం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ట్రిపుల్ టీ(T) విధానంతో ముందుకెళ్తున్నారు. టెస్టింగ్... ట్రేసింగ్... ట్రీట్మెంట్ పేరుతో కేవలం 10రోజుల్లో 50వేల మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్ కేసులను మోల్డ్, మోడరేట్, సివియర్గా విభజించి చికిత్స అందించనున్నారు.
హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, చెస్ట్, ఫీవర్, సరోజిని హాస్పిటల్స్తో పాటు 8 ఏరియా ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో ఏరియా ఆస్పత్రి పరిధిలో 2వేల 500మందికి టెస్టులు చేయనున్నారు. మరి, కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న ట్రిపుల్ టీ(T) వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.