మానస సరోవర్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుపడిన యాత్రీకులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. వారిని అక్కడకు తీసుకువెళ్ళిన సదరన్ ట్రావెల్స్ హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో తిరుగు ప్రయాణానికి అందుబాటులోకి రాలేదు. దీంతో యాత్రీకులు ఆ మంచుకొండల్లో మూడురోజుల పాటు చిక్కుకుపోయారు. వారున్న ప్రాంతంలో సెల్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో వారక్కడ చిక్కుకున్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పే వీలు కూడా లేకపోయింది. అయితే, బయటపడే దారి వెతుకులాటలో ఒకచోట సెల్ఫోన్ సిగ్నల్ అందడంతో ఓ వీడియో తీసి అతి కష్టం మీద యాత్రికుల్లో ఒకరైన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నివాసి మదన్గౌడ్ తమ బంధువులకు పంపారు. దీంతో విషయం తెలిసిన యాత్రీకుల బంధవులు ఆందోళనకు గురయ్యారు. వారు సదరన్ ట్రావెల్స్ ను సంప్రదించగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. చివరకు వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్ను ఏర్పాటు చేశామని, యాత్రికులంతా సోమవారం సాయంత్రానికి యాత్రికులంతా నేపాల్ చేరుకున్నారని ట్రావెల్స్ మేనేజర్ మంగతాయారు చెప్పారు. బుధవారానికి నగరవాసులంతా హైదరాబాద్ చేరుకుంటారని వివరించారు. దీంతో యాత్రీకుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
జరిగిందేమిటి..
హైదరాబాద్ నుంచి 11 మంది సహా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, దిల్లీ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు సదరన్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవర్ యాత్రకు ఈ నెల 13న బయల్దేరారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వారు ఈ నెల 23న తిరిగి నగరానికి చేరుకోవాల్సి ఉంది.
హైదరాబాద్ నుంచి విమానంలో దిల్లీ మీదుగా కాఠ్మాండూ వరకూ వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్లో మానస సరోవర్కు వెళ్తారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో హిల్సా, అక్కడి నుంచి సిమీకోర్టు, తదుపరి నేపాల్గంజ్, చివరకు కాఠ్మాండూకు చేరుకోవాల్సి ఉంది. అయితే యాత్రికుల బృందం హిల్సా చేరుకున్నాక వారికి కష్టాలు మొదలయ్యాయి. వారు అక్కడి స్థానిక ప్రదేశాలను తిలకించి వచ్చేసరికి తిరిగి తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్ కనిపించలేదు. ఎంతసేపు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. మంచు కురుస్తుండడం, ఆ ప్రదేశంలో నివాస స్థలాలు లేకపోవడం, చరవాణులకు సిగ్నళ్లు అందకపోవడంతో ఎవరికీ తమ పరిస్థితిని వివరించలేకపోయారు. దిక్కుతోచక హిల్సాలోని గుడారాల్లో ఉంటూ హెలికాప్టర్ కోసం ఎదురుచూశారు. ఉన్న కొద్దిపాటి ఆహారం, నీటితోనే మూడు రోజులు గడిపారు. నాలుగో రోజు ఒకచోట సెల్ఫోన్ సిగ్నల్ అందడంతో ఓ వీడియో తీసి అతి కష్టం మీద యాత్రికుల్లో ఒకరైన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నివాసి మదన్గౌడ్ తమ బంధువులకు పంపారు. దీంతో యాత్రీకులంతా క్షేమంగా బయటపడ్డారు.