త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐ పాస్ మాదిరే కొత్తగా ఆమోదం పొందిన మున్సిపల్ చట్టం కూడా విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా మున్సిపల్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండదని తద్వారా అవినీతి తగ్గుతుందని చెప్పారు. ఈ చట్టంపై అవగాహన పెంచేందుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారని వివరించారు. ప్రజలను అవినీతి చీడ నుంచి రక్షించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులు ఒకే చోట పాతుకుపోవడం కుదరదన్నారు. ఇక నుంచి నోటీసు ఇవ్వకుండా అక్రమ కట్టడాలను కూల్చివేసే అధికారం కొత్త చట్టం కల్పిస్తుందని.. ప్రజలకు సెల్ఫ్ అస్సెస్మెంట్ అధికారం ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం అని అన్నారు.
అంతేకాకుండా మున్సిపాలిటీల్లో 75 గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి తీసుకునే అవసరం ఉండదని కేటీఆర్ తెలిపారు. కొత్త చట్టంతో పేదలకు ఊరట కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తమ శ్రేణులను ఆదేశించినట్లు వివరించారు. జిల్లాకు మూడు లేదా నాలుగు మున్సిపాలిటీలే ఉన్నాయి కాబట్టి కలెక్టర్లపై పెద్దగా భారం ఉండదని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇప్పటికే 35 లక్షలు దాటిందన్న కేటీఆర్.. త్వరలోనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని కేటీఆర్ తెలిపారు. బీజేపీ వాళ్ళు 4 ఎంపి సీట్లు గెలవగానే ఆగడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ గెలిచినవి కేవలం 8 జడ్పీటీసీలు మాత్రమే అని ఎవరేంటో మున్ముందు తేలుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు భాద్యత ఎమ్మెల్యేలదే అన్న కేటీఆర్ రెండో స్థానం గురించి కాంగ్రెస్, బీజేపీలు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ సంక్షోభంలో ఉందని ఏఐసీసీకి ఇపుడు అధ్యక్షుడే లేరన్నారు. ఎమ్మెల్యేలు, జర్నలిస్టుల స్థలాల కేసు సుప్రీంకోర్టులో ఉందని దీనికి సంబంధించి పరిష్కారం కనుగొనాలని సీఎం కేసీఆర్ సీఎంవో అధికారులకు వారం రోజుల గడువు విధించారని కేటీఆర్ తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కార బాధ్యత తనదన్న కేటీఆర్.. త్వరలోనే జర్నలిస్టు ప్రతినిధులతో భేటీ అవుతానని స్పష్టం చేశారు.