ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం వార్షిక బడ్జెట్ శాసనసభ చివరి రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం వార్షిక బడ్జెట్ శాసనసభ చివరి రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభప్రారంభం అయిన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా ఆందోళనలను సృష్టిస్తున్నపౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు సీఎం కేసీఆర్. దేశంలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత నెల 16వ తేదీన తెలంగాణ కేబినెట్ సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించగా, ఈ రోజు ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో పాటు కేరళ, పంజాబ్, ఢిల్లీ, బిహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా అసెంబ్లీల్లో కూడా సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని సీఎం కేసీఆర్ అన్నారు. సీఏఏపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని ఈ చట్టం భారత దేశానికి మంచిది కాదన్నారు. వందల ఏండ్ల మెట్రో పాలిటన్ కల్చర్ ఉన్న దేశంలో మన వైఖరేంటో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో ఉన్న ప్రజలలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇలాంటి చట్టాలు అమలు చేయడం ద్వారా దేశ ప్రతిష్ట దిగజారుతుందని ఆయన అన్నారు. సీఏఏపై కేంద్రం మరోసారి పునఃసమీక్షించుకోవాలని ఆయన అన్నారు. గోలీమారో నినాదాలు తమకు బాధ కలిగించాయని అన్నారు. సీఏఏ చట్టం దేశవ్యాప్తంగా అనుమానాలకు ఆందోళనలకు దారితీస్తుందని, వీటిపైన స్పష్టమైన అవగాహనతోనే వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అన్ని పక్షాల అభిప్రాయం మేరకు తీర్మానాన్ని ఆమోదించనున్నారు.