కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆహ్వానాలు పలుకుతున్నారు. ముంబై వెళ్లి ...మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, సీఎం ఫడ్నవిస్ను కేసీఆర్ ఆహ్వానించారు. త్వరలో విజయవాడ వెళ్లనున్న కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ను కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథులకు స్వయంగా ఆహ్వానాలు పలుకుతున్నారు. ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్తో సమావేశమైన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఫడ్నవిస్ కంటే ముందుగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావును కలిసిన కేసీఆర్ కాళేశ్వరం ఓపెనింగ్ రావాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ముఖ్యఅతిథిగా రానున్నారు. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా విజయవాడ వెళ్లి జగన్ను ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 151 టీఎంసీల గోదావరి జలాలను ఒడిసిపట్టనున్నాను. అలాగే ఈ ప్రాజెక్టు కింద సగానికి పైగా తెలంగాణ కవర్ కానుంది. 13 జిల్లాలు, 80 నియోజకవర్గాల్లో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చి దాదాపు 60శాతం తెలంగాణ సస్యశ్యామలం కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు చేపట్టారు. అలాగే 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మిస్తున్నారు. భారతదేశంలో ఏ ప్రాజెక్టులోనూ వినియోగించని భారీ పంపులను కాళేశ్వరంలో ఉపయోగించారు. అంతేకాదు రివర్స్ పంపింగ్ టెక్నాలజీతో కాళేశ్వరం దేశంలోనే అరుదైన ప్రయత్నంగా రికార్డులకెక్కింది.