నేడు(మంగళవారం) ఉదయం 11.30లకు తెలంగాణ క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదిమంది మంత్రులతో రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. మంత్రివర్గంలో అవకాశం పొందినవారు.. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్రెడ్డిలు కాగా కొత్త మంత్రివర్గంలో ఆరు కొత్త ముఖాలకు చోటు కల్పించారు సీఎం కేసీఆర్. ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. గత కేబినెట్ నుంచి నలుగురు పాతవారికే కొత్త జాబితాలో స్థానం దక్కింది. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ లు ఉన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం, తాజా మంత్రులతో కలిపి తెలంగాణ క్యాబినెట్ సంఖ్య 12 కు చేరింది. కాగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాలని వీరిని సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో ఆహ్వా నించారు. 'మీరు ప్రభుత్వంలో ఉంటున్నారు. బంగారు తెలంగాణ సాధనకు కలిసి పనిచేద్దాం'అని సీఎం చెప్పారు. సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు సైతం మంత్రులుగా ప్రమాణం చేసే వారికి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఫోన్లో సీఎం మాట్లాడిన వెంటనే వీరంతా ప్రగతిభవన్కు చేరుకుని కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుంటే మంత్రివర్గం తొలిజాబితాలో ఒక్క మహిళకు కూడా స్థానం దక్కలేదు. టీఆర్ఎస్ తరుఫున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్)లలో ఒకరికి తాజా విస్తరణలో మంత్రిగా చాన్స్ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది.