High Court On Degree Exams : ఆన్‌లైన్ పరీక్షలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Update: 2020-09-10 13:13 GMT

ప్రతీకాత్మక చిత్రం

High Court On Degree Exams : కరోనా వేళ డిగ్రీ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన పటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో హాస్టల్స్‌ అన్నిమూసివేసి ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని, అందుచేత సెమిస్టర్ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. ఈ వాదనపై స్పందించిన న్యాయస్థానం సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తారా అనే విషయంపై స్పష్టత కోరింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని అన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది.

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్‌, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కాగా ఈనెల 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు మొదలుకానున్నాయి.

Tags:    

Similar News