కొత్త అసెంబ్లీ నిర్మాణం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై హైకోర్టులో పదునైన వాదనలు జరిగాయి. అయితే, అసెంబ్లీ భవనం ఉండగా, మళ్లీ కొత్త భవనం ఎందుకంటూ ప్రశ్నించిన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. సుప్రీం అండ్ హైకోర్టు తీర్పులను ప్రస్తావించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదంటూ వాదనలు వినిపించారు.
ఆల్రెడీ అసెంబ్లీ భవనం ఉండగా, మళ్లీ కొత్త భవనం ఎందుకంటూ ప్రశ్నించిన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. కొత్త అసెంబ్లీ నిర్మాణంతో ప్రజాధానం దుర్వినియోగం కాబోదని వివరణ ఇస్తూనే, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదంటూ వాదనలు వినిపించింది.
ప్రస్తుతం వినియోగిస్తోన్న అసెంబ్లీ భవనం 102ఏళ్ల నాటిదని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం శాసనసభకు ఉండాల్సిన వసతులు, సౌకర్యాలేమీ లేవని వివరించింది. అయినా ఆ భవనం అసెంబ్లీ కోసం నిర్మించింది కాదని, అప్పటి రాజు కోసం ఏర్పాటైనదంటూ వాదించింది. అయితే ఎర్రమంజిల్ పురాతన భవనం కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. దాంతో ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై తమను ఎలా సంతృప్తిపరుస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ఇక కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారా? అంటూ హైకోర్టు ప్రశ్నించడంతో దానిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్లానింగ్ లేకుండా అనుమతి తీసుకోలేమన్న తెలంగాణ సర్కార్ విస్తీర్ణం చూసిన తర్వాతే హెచ్ఎండీఏ అనుమతి కోరతామంటూ వివరణ ఇచ్చింది. అలాగే ట్రాఫిక్ సమస్యలన్నీ పాలసీ విధానాలకు సంబంధించినవన్న ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసమే డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.
సుప్రీం అండ్ హైకోర్టు తీర్పులను ప్రస్తావించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్రావు విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే నెక్ట్స్ హియరింగ్కు ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ కోర్టుకు రావాలని ఆదేశించింది.