టీచర్ అవతారం ఎత్తిన మంత్రి హరీష్ రావు.. మాస్టార్ పేరు రాయలేకపోయిన విద్యార్థులు...
మంత్రి హరీష్ రావు టీచర్ అవతారం ఎత్తారు. సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్ధులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్ధులను ఆయా సబెక్టులకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. విద్యార్ధులు తెలుగు కూడా సరిగా చదవలేక పోవడంతో పాటు రాయలేకపోవడం పట్ల క్లాస్ పీకారు. ఇలా చదివితే ఎలా పాసవుతారని గట్టిగానే మందలించారు.
కనీసం ఎక్కాలు కూడా విద్యార్ధులు చెప్పకపోవడం బాధకరమన్న హరీష్రావు ఇలా చదివితే ప్రపంచంతో ఎలా పోటీపడతారని ప్రశ్నించారు. టీవీలు, సెల్ ఫోన్లు పక్కన పెట్టాలన్నారు. టెన్త్ క్లాస్ ఫలితాలలో కంది పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు. పాఠశాల సమస్యలపై నివేదిక రూపొందించి తనకు అందజేయాలని ప్రధానోపాధ్యాయుడికి ఆదేశించారు.