గాంధీ ఆస్పత్రిలో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. జనరల్ వార్డులో స్వైన్ఫ్లూ పేషెంట్
అసలే కొవిడ్తో జనం భయపడిపోతున్నారు. ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటు స్వైన్ ఫ్లూ లక్షణాలతో కొంతమంది ఆస్పత్రుల పాలవుతున్నారు. దీనిపై వైద్య శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్లోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది. అక్కడ వారికి చికిత్స అందిస్తోంది. రోగులు పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్వైన్ ఫ్లూ రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి తీరు మరిన్ని ఆరోపణలు మూటగట్టుకుంటోంది. గాంధీ ఆస్ప్రతిలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. స్వైన్ఫ్లూ పేషంట్కు చికిత్స అందించడంలో అలసత్వం వహించారు. మామూలు పేషంట్ల మధ్యలో స్వైన్ఫ్లూ పేషంట్కు బెడ్ ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. అర్ధరాత్రి నుంచి వైద్యులు, నర్సులు పత్తా లేకుండా పోయారు.
స్వైన్ ఫ్లూకు ప్ర్రత్యేక వార్డు ఉన్న ఆ పేషంట్ను ఆ వార్డుకు ఎందుకు తరలించలేదు...? మాములు వార్డుల్లో పేషంట్ను ఉంచితే మిగతా పేషంట్లకు వ్యాధి సోకదా...? ఈ మాత్రం కూడా వైద్య సిబ్బందికి తెలియదా...? తెలిసీ కూడా ఆ పేషంట్ను జనరల్ వార్డులో ఎందుకు ఉంచారు...? చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన వారికి లేని రోగాలు అంటుకోవా...? స్వైన్ ఫ్లూ రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.