ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించిన అరుదైన ఘటన హైదరాబాద్లోని చిలకలగూడ గీతానర్సింగ్ హోంలో చోటుచేసుకుంది. హేమలత, లక్ష్మణ్ దంపతులకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నెలలు నిండకముందే జన్మించడంతో ఆ శిశువులను ఆధునిక వైద్యం కోసం విద్యానగర్లోని నియో బీబీసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ శిశువులు 1.3, 1.4 కిలోగ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు తల్లి పాలు తాగుతున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు.
పుట్టిన సమయంలో కేవలం వెయ్యి గ్రాముల బరువున్న శిశువులకు వైద్యులు ఆధునిక చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని, వారు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. నియో బీబీసీలో ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో 8 లక్షల మందిలో ఒకరికి ఇలా అరుదైన కాన్పు జరుగుతుందని వారు అన్నారు.