మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు కన్నుమూత
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జువ్వాడి రత్నాకర్రావు తుదిశ్వాస విడిచారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జువ్వాడి రత్నాకర్రావు తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో రత్నాకర్రావు కరీంనగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరుపొందారు. ఆయన జగిత్యాల పంచాయతి సమితి అధ్యక్షుడిగా 1982లో పనిచేశారు. జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్ టికెట్పై 1982లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 1989లో పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి బుగ్గారం నుంచి తొలిసారి గెలుపొందారు. అనంతరం 1994లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయిన పట్టు విడవకుండా 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 2009, 2010లో కోరుట్ల నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.