Peddapalli: నీరు అందక ఎండిపోతున్న పంటలు
Peddapalli: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీళ్లు అందుతాయని భావించిన రైతులు * పెద్దపల్లి జిల్లాలో నీళ్లు అందక 500 ఎకరాల్లో వరి
Representational Image
Peddapalli: తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇస్తోంది ఆ జిల్లా...కానీ దీపం కింద చీకటిల ఆ జిల్లాలో పంటలు మాత్రం ఎండిపోతున్నాయి. కంటికి కనిపిస్తున్న నీళ్ళు పొలాల్లోకి రాకపోవడంతో కన్నీళ్లు పెట్టకుంటున్నారు రైతులు. తమ పంట ఎండిపోతుందంటూ వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రైతుల దీనస్దితిపై హెచ్ఎంటీవి స్పెషల్ స్టోరి.
పెద్దపల్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి అత్యంత కీలకమైన బ్యారేజ్ లు ఈ జిల్లాలోనే ఉన్నాయి. తెలంగాణ అంతట విస్తరిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకి నీళ్లు ఇస్తున్న జిల్లా పెద్దపల్లి. ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లు ఈ జిల్లాలోనే ఉన్నాయి. కానీ గతంలో ఎదుర్కొన్న పరిస్థితులే కాళేశ్వరం ప్రాజెక్ట్ తరువాత కూడా జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండలాల్లోని మల్యాల, ఇప్పలపల్లి, మొట్లపల్లిగూడెం, గుంపుల జిల్లాకుంటలో ఎస్సారెస్పీ నీరు అందక పంటలు ఎండిపోయాయి. నిజానికి ఎస్సెరెస్పీకి చివరి ఆయకట్టుగా ఉండే ఈ ప్రాంతాలు గతంలోను ఇవే పరిస్దితులను ఎదుర్కొన్నాయి. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో నీళ్లు అందుతాయని రైతులు బావించారు... కాని ఇప్పుడు కూడా అవే కష్టాలను స్థానిక రైతులు ఎదుర్కొంటున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే నీళ్లు అందక సుమారు 500 ఎకరాల్లో వరి., మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి. మరికొన్ని ఇప్పుడు చివరిదశలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఎస్సారెస్పీ వరద కాలువలు ఒకవైపు 365 రోజు నిండుకుండల కనపడుతూంటే...చివరి ఆయకట్టుగా ఉన్న డి 86 కాలువలు మాత్రం ఎండిపోయి రైతులను వెక్కిరిస్తున్నాయి.
నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఎస్సారెస్పీ కాలువలో నీటి ప్రవాహం పెంచి చివరి ఆయకట్టుగా ఉన్న ఈ ప్రాంతాలకు నీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అధికార విపక్షాల మద్య వాగ్వాదం జరుగుతోంది.
రాజకీయాలు ఎలా ఉన్న స్దానికంగా రైతులకు మాత్రం నీళ్లు ఇప్పుడు అత్యవసరంగా మారిపోయాయి. చివరి ఆయకట్టు ప్రాంతాల వరకు నీటిని చేర్చాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులు స్దానిక ప్రజాప్రతినిదులపై కూడా ఉంది. త్వరగా మేల్కొంటే రైతులకు నష్టాల నుండి కొంతైన బయటపడేసే అవకాశాలు ఉన్నాయి.