మాజీ మంత్రి మరియు కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్ గౌడ్ (60) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (జులై 29) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయన ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి ఆయన్ని జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ముఖేశ్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు గోషామహల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు . అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ కుమార్ రెడ్డి హయాంలో మంత్రి పదవులు చేపట్టారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముఖేష్ గౌడ్ 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 1989, 2004లో మహారాజ్గంజ్, 2009లో గోషామహల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2007లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2009లో మరోసారి మార్కెటింగ్ శాఖ బాధ్యతలను అయిదేళ్లపాటు నిర్వర్తించారు. 2014, 2018లలో గోషామహల్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ముఖేష్ గౌడ్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.