ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం... కొండలు... అడవుల్లో గిరిజన గ్రామాలున్నాయి... ఇప్పటికీ చాలా గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం లేదు... రాళ్లు రప్పలు... వాగులు వంకలు దాటి వెళితే తప్ప బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి.
మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి జబ్బు చేస్తే ఇక అంతే... వారిని ఆసుపత్రికి చేర్చడానికి ఎన్నో ప్రయాసాలు తప్పవు... అంబులెన్సులు ఉన్నా... రోడ్డు లేక గ్రామాలకు రావు... రోడ్డు సౌకర్యం ఉన్నంత వరకు వచ్చి అక్కడే ఆగిపోతుంటాయి... రోగిని అక్కడికి తీసుకువస్తే తప్ప ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేదు.
అక్కడ ఎడ్లబండ్లే అంబులెన్స్లుగా మారాయి. పురుడు కోసం మహిళలు ఆసుపత్రికి వెళ్లాలంటే అనేక అవస్థలు పడుతున్నారు. గాదేగూడ మండలం పావన్ పూర్ లొద్దిగూడలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి తరలించడానికి రవాణా సౌకర్యంలేక నర్సు 12 కిలోమీటర్లు నడిచి వెళ్లి గ్రామంలో డెలివరీ చేసింది. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ వరకు ఎడ్లబండిలో తరలించారు. ఝురి ఆసుపత్రిలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.