ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశా ల కోసం నిర్వహించే ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్ ఎంట్రన్స్ పరీక్షల నోటిఫికేషన్ ను ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కమిటీ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి ఆయా కమిటీలు కీలకనిర్ణయం తీసుకోవడానికి బుధవారం అంటే ఈ రోజు నుంచి సమావేశం జరపనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క సెట్ కమిటీ సమావేశాన్ని ఒక్కో రోజు నిర్వహించేందుకు సెట్స్ కన్వీనర్లు తేదీలు ఖరారు చేశారు.
ఇందులో భాగంగానే ఈనెల 15న లేదా 18న ఎంసెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా బుధవారం అంటే 12వ తేదీన ఐసెట్, 17న ఎడ్సెట్, 19వ తేదీన పీఈ సెట్ సమావేశాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సమావేశాలకు ఆయా సెట్స్కు సంబంధిత యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇక పోతే ఎంతో మంది విద్యార్థులు హాజరు కానున్న ఎంసెట్ సంబంధించిన సమావేశం అనంతరం ఈసెట్ కమిటీ సమావేశం, తరువాత లాసెట్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సమావేశాలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో నిర్వహించే వివిధ సెట్లకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ తేదీలను, దాంతో పాటుగానే దరఖాస్తుల స్వీకరణ తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక పోతే ఈ నెల 20 లేదా 21న ఎంసెట్ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. నోటిఫికేషన్లతో పాటు నియమ నిబంధనలు, విద్యార్హతలను ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు.
వీటితో పాటుగానే విద్యార్థులు ఎక్కువగా రాసే ఎంట్రన్స్ లలో ముఖ్యమైనవి పాలిసెట్. ఈ విద్యాసంవత్సరంలో మార్చి 2వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఇందుకు గాను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కృషి చేస్తోంది. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించనున్నారని అధికారలు తెలిపారు. ఇక విద్యార్థులు ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో పరీక్షల కోసం సంసిద్ధులై ఉండాలని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.