మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కలకలం చోటు చేసుకుంది. ఓ వైపు కలెక్టర్ శివలింగయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుండగానే బయ్యారం మండలానికి చేందిన భూక్య, కాశీరాం దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. మాజీ నక్సల్స్ అయిన వీరిద్దరూ జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు ప్రభుత్వం 2013 లో 4.5 ఎకరాల భూమి కేటాయించారు. అందులో వ్యవసాయం చేస్తున్న వీరిని కొంతమంది వచ్చి భూమి తమదంటూ గొడవకు దిగారని ఈ అంశంపై రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఈ దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వెంటనే వీరిని అడ్డుకున్న సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.