CoronaVirus: తెలంగాణాలో తొలి కరోనా కేసుకు రేపటికి ఏడాది!

ఏడాది క్రితం వరకూ జీవనం బిందాస్. తరువాత అంతా చెల్లా చెదురు. కరోనావైరస్ తొలి కేసు నమోదు అయి సరిగ్గా ఏడాది!

Update: 2021-03-01 09:17 GMT

మళ్లీ ముప్పు.. వద్దే వద్దు

మార్చి 2, 2020లో తెలంగాణలో కరోనా మహమ్మారి వెలుగు చూసింది. ఇదే రోజు రాష‌్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. మార్చి నుంచి నవంబర్ దాకా వైరస్ ఉధృతి కొనసాగింది. కరోనా ఎన్నడూలేని అలవాట్లను సాధారణ జీవనంలో కచ్ఛితంగా పాటించేలా చేసింది. గత ఏడాదిలోనే కోవిడ్ టీకా రావడం అద్భుత ఘట్టంగా చెప్పవచ్చు.

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై రేపటికి ఏడాది అవుతుంది. మార్చి 2, 2020లో రాష్ట్రంలో మొదటి కోవిడ్ కేసు వెలుగుచూసింది. ఈ సంవత్సర కాలంలో కరోనా అనేక కొత్త పాఠాలు ప్రజలకు నేర్పింది.

కరోనా ఎన్నడూలేని అలవాట్లను సాధారణ జీవనంలో కచ్ఛితంగా పాటించేలా చేసింది. ముఖానికి మాస్కు లేకుండా బయటకు రావద్దని చెప్పింది. ఏది తాకినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని గుర్తుచేసింది. ఏ వ్యక్తి దగ్గర్లోకి వెళ్లి మాట్లాడరాదని, గుంపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. మరోవైపు కరోనా కట్టడి కోసం గత ఏడాదిలో టీకా రావడం మరో అద్భుతమైన ఘట్టం.

తెలంగాణలో ఫిబ్రవరి 27, 2021 నాటికి కేసుల సంఖ్య 2,98,807 కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,95,222 మంది కోలుకున్నారు. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారు 98.80 శాతం కావడం విశేషం. ఈ విషయంలో జాతీయ సగటు 97.1 శాతంగా నమోదైనట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దాదాపు 70 శాతంమందికి పైగా ఎటువంటి లక్షణాలు లేకుండానే కొవిడ్‌ పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారనేది గుర్తించారు.

గతేడాది ఆగస్టులో రోజుకు సగటున 9.87 మంది చొప్పున మృతిచెందగా సెప్టెంబరులో సగటున 9.96 చొప్పున, నవంబరులో సగటున రోజుకు నలుగురి చొప్పున ప్రస్తుతం రోజుకు సగటున ఒకరు చొప్పున కొవిడ్‌తో మృతి చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కరోనా మృతులు సగటున 0.54 శాతం ఉండగా, జాతీయ సగటు 1.4 శాతంగా నమోదైంది.

గతేడాది కేసులు పెరుగుతుండడంతో జనం కరోనా జాగ్రత్తలు పాటించారు. ఇటీవల కేసుల సంఖ్య తగ్గుతుండడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత మూడు నెలలుగా వైరస్‌ వ్యాప్తి నెమ్మదించింది. అయినా రెండో ఉద్ధృతి వస్తుందేమోననీ, యూకే వైరస్‌, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ విరుచుకుపడుతాయేమోననీ ఆందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి.

కొద్దిరోజులుగా జీహెచ్‌ఎంసీలో, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, తదితర జిల్లాల్లో స్వల్పంగా కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది. అజాగ్రత్తగా ఉంటే మరోసారి వైరస్‌ తీవ్రత పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు, టీకాలే కొవిడ్‌ నుంచి రక్షణనిస్తాయని సూచిస్తున్నారు. 

Tags:    

Similar News