కరోనా హాట్‌స్పాట్‌ ప్రాంతాలపై పోలీసుల గురి

Update: 2020-04-07 09:01 GMT

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పోలీసులు మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం గుర్తిస్తున్న హాట్‌స్పాట్లపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. కరోనాప్రబలకుండా ప్రజల రాకపోకలను కట్టుదిట్టంగా నియంత్రించే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.

నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య అటు ప్రభుత్వాన్నీ, ఇటు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు వారాలుగా ప్రజలు నిర్బంధంలోనే ఉన్నా కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ పరిస్థితుల్లో దీనికి అడ్డుకట్ట వేయాలంటే వ్యాధి సోకినవారున్న ప్రాంతాలను మిగతా ప్రాంతాల నుంచి వేరుచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంటే రాకపోకలు నిలిపివేయడమే. ఈ బాధ్యత పోలీసులపై పడనుంది. కరోనా ఉద్ధృతి మొదలైనప్పటి నుంచీ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్న పోలీసులు ఇప్పుడు ఈ అదనపు బాధ్యతలు సైతం చేపట్టనున్నారు.

ఇండోనేషియా నుంచి వచ్చిన వారి ద్వారా కరీంనగర్‌లో ఒకేసారి పది కేసులు బయటపడ్డాయి. కరీంనగర్‌లో సత్వర చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పోలీసుశాఖ అక్కడ క్రియాశీలక పాత్ర పోషించింది. కరోనా బాధితులు తిరిగిన, బస చేసిన ప్రాంతాలలో ప్రజల రాకపోకలను నియంత్రించడంలో సఫలమైంది పోలీస్‌శాఖ. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి బయట తిరుగుతున్న వారిని నియంత్రించగలిగింది. వైద్య సిబ్బందితో పాటు కరోనా నియంత్రణలో పాలుపంచుకుంటున్న ఇతర ప్రభుత్వ సిబ్బందికి సహాయ సహకారాలు అందజేసింది ఇప్పుడు ఇదే నమూనాను అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే గుర్తించిన హాట్‌స్పాట్లను నిర్బంధించాలని భావిస్తున్నారు.


Tags:    

Similar News