నల్లమలలో యురేనియం సంపదను వెలికి తీసి విదేశాలకు తరలించి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు లబ్దిపొందాలని చూస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వచ్చేవారి గుండెల్లో గునపం దింపుతామని హెచ్చరించారు. నాగర్కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలో ఆయన రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యురేనియం వెలికితీతపై గతంలోనే స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైందన్నారు. అప్పట్లో ఎన్నికలు రావడంతో వెనుకడుగు వేసిన ప్రభుత్వాలు మళ్లీ యురేనియం వెలికితీతకు సిద్ధమవుతున్నారని చెప్పారు. చత్తీస్ ఘడ్, పులివెందులలో యురేనియం తవ్వకాలతో అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. నల్లమలలోనూ అదే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ఆందోళనను ఉదృతం చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.