Farmer Bill 2020 : రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం.. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2020-09-28 11:30 GMT

Farmer Bill 2020 : ఇటీవలె కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని అమలు చేయవద్దంటూ దేశవ్యాప్తంగా రాజ్ భవన్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ నాయకులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలనే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్లకు వినతిపత్రం అందజేయాలని రాజ్‌భవన్‌కు బయల్దేరారు. అయితే గవర్నర్ తమిళిసై వారిని కలవడానికి నిరాకరించడంతో దిల్‌కుష్‌ అతిథి గృహం ఆవరణలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అంతే కాదు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలను అడ్డుకొని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ఎంతో మంది రైతులు ఇబ్బందుల పాలవుతారని అన్నారు. ఈ చట్టంతో రైతులను చీకట్లోకి నెట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, తమను అడ్డుకోవడం అన్యాయమని ఉత్తమ్‌ విమర్శించారు. ఆయనతో పాటు దిల్ కుషా గేట్ బయట ఎమ్మెల్యే సీతక్క, ఇందిరా శోభన్, నెరేళ్ల శారదా మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. దీంతో పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి లేకపోవడంతో నేతలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసీఆర్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.

Tags:    

Similar News