రేవంత్ యాక్షన్ ప్లాన్ అదిరిందా?
అట్టహాసంగా మల్కాజ్గిరి ఎంపీ ఆఫీసు ప్రారంభోత్సవం - గాంధీభవన్ అటెండర్తో కార్యాలయం రిబ్బన్ కటింగ్ - తరలివచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకులు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రూటే సెపరేటు. ఏం చేసినా డిఫరెంట్ స్టైల్లో చేయడం ఆయన హాబి. ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా అలాంటి విభిన్న పంథానే ఎంచుకున్నారు రేవంత్ రెడ్డి. ఒక్క చర్యతో అనేక విమర్శలకు ఆన్సరిచ్చారు. ఇంతకీ మల్కాజిగిరిలో రేవంత్ చేసిందేంటి అందులో వున్న అంతుచిక్కని వ్యూహమేంటి?
అట్టహాసంగా మల్కాజ్గిరి ఎంపీ ఆఫీసు ప్రారంభోత్సవం - గాంధీభవన్ అటెండర్తో కార్యాలయం రిబ్బన్ కటింగ్ - తరలివచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకులు - తెలంగాణ ఉద్యమకారులనూ సన్మానించిన రేవంత్ రెడ్డి
ఎంపీ ఆఫీసు అట్టహాసం వెనక అంతుచిక్కని వ్యూహముందా? - కార్యాలయ ప్రారంభోత్సవంతో రేవంత్ చెప్పకనే చెప్పిన విషయమేంటి? - గ్రాండ్ ఓపెనింగ్పై గాంధీభవన్ పెద్దలు కత్తులు నూరడానికి కారణమేంటి?
మల్కాజ్గిరి ఎంపీ, టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పనులు, ఆలోచనలు ఎప్పుడూ కాస్త డిఫరెంట్గానే వుంటాయి. ఎవరూ ఊహించని రీతిలో పనులు చేస్తుంటారాయన. మిగతా నేతలకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 2 సంవత్సరాలు అవుతోంది కానీ, ఆయన గాంధీభవన్ కు వెళ్ళింది మాత్రం వేళ్ళ మీద లెక్కించొచ్చు. పార్టీ నేతలంతా గాంధీభవన్లో కూర్చుని ప్రతి విషయానికీ ప్రెస్ మీట్ పెడుతుంటారు. కానీ రేవంత్ మాత్రం గాంధీభవన్ కు వెళ్లడం చాలా అరుదు. అలాంటి రేవంత్ రెడ్డిపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. రేవంత్ ఏ పనిచేసినా ప్రశంశలతో పాటు అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి.
రేవంత్ను ప్రోత్సహించవద్దని, దాని వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని పార్టీ సీనియర్లు అధిష్టానానికి పదే పదే ఫిర్యాదులు చేస్తుంటారు. వి. హనుమంతరావు లాంటి వాళ్ళయితే, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి, ఆయనలో కాంగ్రెస్ భావజాలం లేదని కూడా విమర్శలు చేశారు. తొందరలోనే రేవంత్ కొత్త పార్టీ పెడతారని, పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా బయటకు వెళ్లి కొత్త పార్టీ పెడతారని ఇలా విమర్శలు చేస్తున్నారు. అయితే తన మీద వస్తున్న విమర్శలకు రేవంత్ చెక్ పెట్టారు. ఆ ఒక్క పనిద్వారా కాంగ్రెస్ అంటే ఎంత ఇష్టం, కాంగ్రెస్ మనుషులు అంటే ఎంత గౌరవమో చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి. ఇంతకీ రేవంత్ చేసినదేంటి?
టీడీపీలో ఉన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. తన అభిమానులు తెలంగాణ పులి అని పిలుచుకుంటారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంటికి ప్రతిరోజు వందలమంది అభిమానులు వస్తుంటారు. ఆ ఇళ్ళు చిన్నగా ఉండడంతో ప్రత్యేకంగా అభిమానులను కలవడానికి, మల్కాజిగిరి ప్రజలకు మరింత అందుబాటులో ఉండటానికి ఒక ఆఫీస్ను నిర్మించాలనుకున్నారు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి రేవంత్ వ్యతిరేకులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రేవంత్ కొత్త ఆఫీస్ కట్టుకుంటున్నాడు, ఇక కొత్త పార్టీ పెడతారని పెద్దఎత్తున ప్రచారం చేశారు. విమర్శలపై ఎప్పుడూ స్పందించని రేవంత్, తన ఆఫీస్ ఓపెనింగ్ రోజు వాటన్నింటికీ చెక్ పెట్టారు. సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ సిద్దించిన రోజు పార్టీ ఆఫీస్ను ప్రారంభించడమే కాకుండా దాన్ని గాంధీభవన్ లో 40 సంవత్సరాలుగా అటెండర్గా పనిచేస్తున్న షబ్బీర్ అనే వ్యక్తితో ప్రారంభోత్సవం చేయించారు.
40 ఈయర్స్ ఇండస్ట్రీ నేతలు ఏ రోజూ గాంధీభవన్లో పనిచేస్తున్న వాళ్లకు గౌరవం ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. అదే రేవంత్ తన ఆఫీస్ వాళ్ళతో ప్రారంభోత్సవం చేయించారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవాలి అంటున్నారు రేవంత్ అభిమానులు. ఆఫీస్లో అటెండర్కు రేవంత్ ఇచ్చిన గౌరవం విమర్శకుల నోళ్లు మూయించింది అంటున్నారు ఆయన సన్నిహితులు. పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవంలో తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు రేవంత్.
మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు, సోనియా జన్మదినాన్ని పురస్కరించుకుని తన నియోజక వర్గ కార్యాలయం ప్రారంభోత్సవానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహతో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కార్యాలయానికి వచ్చి అభినందించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పనిచేసిన ఉద్యమకారులను రేవంత్ సన్మానించారు. ఉద్యమ నేత మల్లు స్వరాజ్యంతో సహా చాలామంది ఉద్యమనేతలను, తెలంగాణ సిద్దించిన రోజు రేవంత్ సన్మానించడంపై ఆయన అనుచరుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
అయితే, పార్లమెంట్ ఆఫీసు ఇంత అట్టహాసంగా ప్రారంభించడంపై రేవంత్కు పక్కా వ్యూహముందన్న విశ్లేషణలూ సాగుతున్నాయి. పీసీసీ పీఠంపై కన్నేసిన రేవంత్ రెడ్డి సీనియర్ల మద్దతు కూడగడుతూ, ఇటు సొంత క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారని కొందరంటున్నారు. ఒక పక్క తెలంగాణ ఉద్యమకారులను సన్మానిస్తూ, మరో పక్క గాంధీభవన్ స్టాఫ్కు ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే తన వ్యూహం ఏంటో చెప్పకనే చెప్పారు రేవంత్. ఏది ఏమైనా రేవంత్ ఆలోచనను, గాంధీభవన్ ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యమకారులు ఇచ్చిన గౌరవాన్ని చూస్తే ఆయన దూర దృష్టితోనే వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులంటున్నారు.