గజ్వేల్‌లో కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభ, సీఎం ఇలాకాలో జై కాంగ్రెస్ నినాదం

Gajwel: *గజ్వేల్‌లో కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభ *లక్షమందితో సభ ఏర్పాటుకు కాంగ్రెస్ శ్రేణుల కసరత్తు

Update: 2021-09-17 03:09 GMT

గజ్వేల్‌లో కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభ, సీఎం ఇలాకాలో జై కాంగ్రెస్ నినాదం

Gajwel: ఇవాళ తెలంగాణలో రెండు జాతీయ పార్టీల బహిరంగ సభలు నిర్వహించనున్నాయి.. కాంగ్రెస్, బీజేపీ.. దారులు వేరైనా తెలంగాణలో అధికార లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యాలు, రాజకీయ బలహీనతలను ఎండగట్టాడానికి హస్తం, కమలం పోటీ పడుతున్నాయి. తెలంగాణ విమోచన దినం సందర్భంగా పార్టీలు బహిరంగ సభలు ఏర్పాటు చేశాయి. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో బీజేపీ సభను ఏర్పాటు చేసింది.. మరోవైపు.. సీఎం కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ దళిత, గిరిజన సభను ఏర్పాటు చేయనున్నారు. ఒకపార్టీని మించి మరో పార్టీ సభ ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.. లక్ష మందికి తక్కువ కాకుండా సభలను నిర్వహించాలని అనుకుంటున్నాయి.

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కాంగ్రెస్ దళిత- గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ జరుపుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని దళితులతో పాటు గిరిజనులకూ అమలు చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు తలపెట్టింది. అయితే.. ఇవాళ గజ్వేల్‌ లో నిర్వహించనునున్న ఈ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో గజ్వేల్ గడ్డపై జై కాంగ్రెస్ నినాదం వినిపించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష మందికి తక్కువ కాకుండా సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News