Congress: తెలంగాణలో కొత్త హిస్టరీని క్రియేట్ చేసిన కాంగ్రెస్
Congress: 1989లో తెలంగాణలో 58 స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఈ సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 64 సీట్లు
Congress: దక్షిణ భారతదేశంలో మూడో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టి.. హిస్టరీ క్రియేట్ చేయాలని కేసీఆర్ భావించారు. అయితే ఆ ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేసింది. కేసీఆర్కు హిస్టరీని క్రియేట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీనే హస్టరీని రిపీట్ చేసింది. ఓ వైపు హిస్టరీని రిపీట్ చేస్తూనే మరో వైపు సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది హస్తం పార్టీ. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి కొత్త చరిత్రను సృష్టించింది కాంగ్రెస్.
1983 నుంచి 10 సార్లు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ 60 మార్క్ దాటలేదు. అయితే ఈ సారి మాత్రం 64 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 1983 తర్వాత కాంగ్రెస్లో హేమాహేమీలు ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్ 60 డిజిట్ను చేరుకోలేకపోయింది. కాని ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చూస్తూ 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ హవాకు గండి పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ భాగంగా ఉన్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు తొలిసారి అతి పెద్ద గెలుపు తాజా ఎన్నికల్లో దక్కింది. 1983 వరకు తెలంగాణ ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, ఆర్గుల రాజారాం, నూకల రామచంద్రారెడ్డి వంటి హేమాహేమీలైన నేతలు ఉండడం, మరే పార్టీ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో కాంగ్రెస్ హవా నడిచేది.
దిగ్గజ సినీ నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. తెలంగాణ ప్రాంతంలో నాడు 107 శాసనసభ స్థానాలు ఉండగా కాంగ్రెస్కు కేవలం 43 స్థానాలు మాత్రమే దక్కాయి. టీడీపీ, వామపక్షాలు మిగతా స్థానాలు దక్కించుకున్నాయి.1985 ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లుకు పరిమితం కాగా, 1989లో 58 స్థానాలు దక్కించుకుంది. తర్వాత వరుసగా 1994లో 6, 1999లో 42, 2004లో 48 స్థానాలు మాత్రమే కాంగ్రెస్కు దక్కాయి.
2009కు ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య 119కు పెరిగింది. 2009లో కాంగ్రెస్కు 50 స్థానాలు దక్కగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో 21, 2018 ఎన్నికల్లో 19 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలిచింది. 1983 నుంచి 2014 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ఉండడంతో పాటు కాంగ్రెస్ లో హేమాహేమీలైన నాయకులు ఉండడంతో తక్కువ స్థానాలే గెలిచినా రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కు కష్టాలు ప్రారంభమయ్యాయి.
2014 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పేరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైంది. కేవలం 21 శాసనసభ స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. గెలిచిన 21 మందిలో ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా... ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
2018 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితిలతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగింది. ఒక దశలో గెలుస్తుందని భావించినా చేదు అనుభవమే మిగిలింది. కేవలం 19 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లతోనే సరిపెట్టుకోవడం, బీజేపీ నాలుగు స్థానాలు గెలవడంతో రాష్ట్రంలో మూడో స్థానంలోకి పార్టీ పడిపోయింది. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో వేగం పుంజుకుంది.
హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ ఓటమిపాలైనా ఎక్కడా ఆ ప్రభావం కనిపించనివ్వకుండా రేవంత్ తరచూ భారీ సభలు, ర్యాలీలతో ఊపు తీసుకువచ్చారు. దానికి రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర ప్రభావం తోడయింది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్కు అనుకూలంగా మల్చుకోవడంలో సఫలీకృతమయ్యారు. ఫలితంగా 1983 తర్వాత 1989లో 57 ఆ తర్వాత 2023లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు 64 సీట్లు సాధించింది.