టీకాంగ్రెస్లో చిచ్చు.. హుజూర్నగర్ ఉపఎన్నికకు అధిష్టానం ఎవరినీ ఎంపిక చేయలేదన్న రేవంత్ రెడ్డి
ఇటీవలె హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరును టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రెడ్డి ప్రకటించారు. అయితే హుజూర్నగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా అధిష్టానం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముసలం పుట్టింది. హుజూర్ నగర్ ఉపఎన్నిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఇటీవలె హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరును టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం రేవంత్ అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా ..అధిష్టానం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని వ్యాఖ్యానించారు. తాను మాత్రం చామల కిరణ్రెడ్డిని ప్రతిపాదిస్తున్నానని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి అందరూ దానికి కట్టుబడి ఉండాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి అంతం లేకుండా పోయిందని.. ప్రభుత్వ అవినీతికి సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్కు అందజేస్తానన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ తమిళసై కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు తనకు సమాచారం ఇవ్వలేదని.. ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలియదని రేవంత్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ పై ఎంపీ రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెల్ఫీ దిగేందుకు సంపత్కు అవకాశం ఇవ్వలేదనే కోపం తనపై చూపిస్తే ఏలా అని ప్రశ్నించారు. అసలు యురేనియంపై అంటే సంపత్కు తెలియదని ఎద్దేవా చేశారు.