CM KCR tributes to former minister Konda Laxman Bapuji : ఉద్యమాలకు స్ఫూర్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ : సీఎం కేసీఆర్

Update: 2020-09-27 05:45 GMT

CM KCR tributes to former minister Konda Laxman Bapuji : నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన నేటితరానికే కాకుండా భావితరాలకు కూడా స్ఫూర్తి అని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ అన్నారు. మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన ప్రగతి భవన్‌లో లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు అని ఆయన కొనియాడారు. ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు లక్ష్మణ్‌ బాపూజీ అని అన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో, నాన్‌ ముల్కీ ఆందోళనలో బాపూజీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

లక్ష్మణ్‌ బాపూజీ అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.

బాల్యం, విద్య

కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు.

వ్యక్తిగత జీవితం

బాపూజీ భార్య శకుంతల. ఈమె వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినారు.

నిరంకుశ నిజాం విమోచనోద్యమం

1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే. ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నారు.

రాజకీయ జీవితం

1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. ఇందిరాగాంధీ ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు.

జలదృశ్యం

1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అంత్యక్రియలు 22-09-2012 నాడు జలదృశ్యంలో జరిగింది.

గర్తింపులు

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయంకి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు.

Tags:    

Similar News