పోలీసులు టీఆర్ఎస్ నాయకుల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయాలని భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేంలో ఆయన మాట్లాడారు. ఇటీవల బోయినిపల్లిలో జరిగిన ఓ సంఘటనపై పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు.
బోయినిపల్లిలో ఒక స్థల వివాదంలో అధికార పార్టీ నాయకులు భూమిని కబ్జా చేయడమే కాకుండా, ఆ స్థలంలో వాచ్మేన్ గా పనిచేస్తున్న శంకరప్ప పైన పెట్రోలు పోసి నిప్పంటిచారన్నారు. దాంతో ఆగకుండా శంకరప్ప భార్యను వివస్త్రను చేసి హింసించారన్నారు. ఈ దుష్చర్య జరుగినప్పటికీ పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాచ్మేన్ పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వం ఆయనకు సరైన వైద్యం అందించాలని ఆయన కోరారు. అనంతరం శంకరప్ప భార్యపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని, ఇప్పటికైనా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన మండిపడ్డారు.