తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూగర్భ నిక్షేపాలలో బొగ్గు అతి ముఖ్యమైనది. ఈ నిక్షేపాలతో నిరంతరం అందరి ఇండ్లలో కాంతులు నింపే విద్యుత్తును తయారు చేస్తారు. ఇలాంటి నల్లబంగారాన్ని వెలికితీయడానికి ఏర్పడిన సంస్థే సింగరేణి సంస్థ. ఈ సంస్థద్వారా ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఈ సింగరేణి సిరులతల్లి ఒడిలో ఎన్నో కుటుంబాలు తలదాచుకున్నాయి. ఇలాంటి సంస్దను నడిపించాలంటే ఎంతో ఓర్పూ, నేర్పూ ముఖ్యం.
ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అంటూ ఈ సంస్థను నడిపిస్తున్న సింగరేణి ఛైర్మన్& ఎం.డి. ఎన్.శ్రీధర్ 'ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు'కు ఎన్నికయ్యారు. ఎంతో మందికి జీవనాధారమైన సింగరేణి సంస్థను అత్యద్భుత వృద్ధి రేటుతో నడిపిస్తున్నారు. దీంతో ఈ సంస్థకు, ఎం.డీ ఎన్.శ్రీధర్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఎన్నో వ్యయప్రయాసలతో కష్టపడి సంస్థను ముందంజలో నిలుపుతున్నారు. దీంతో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 'ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు'కు ఆయనను ఎంపిక చేసారు.
ఈ మేరకు హైదరాబాద్ మహా నగరంలో జరిగిన 41వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ సోసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్సు-2019 ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఎం.డి. ఎన్.శ్రీధర్ కు అవార్డును ప్రదానం చేసారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో ఎన్.శ్రీధర్ సింగరేణిని సక్రమంగా నడిపిస్తున్నారన్నారు. అంతే కాక తెలంగాణ పరిశ్రమ ప్రతిభకు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు.
ఈ విధంగా సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ అనేక అవార్డును సాధించాలని ఆయన తెలిపారు. కొన్ని లక్షల మంది కడుపునింపుతున్న ఈ సంస్థలో అనేక సేఫ్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని ఆయన అన్నారు.