Case on Singareni CMD: సింగరేణి సీఎండీపై కేసు నమోదు..

Case filed on Singareni CMD:తెలంగాణ సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ తో పాటు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, జీఎం ఎస్టేట్స్, కొత్తగూడెం జీఎంపైనా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ కేసు నమోదు చేసింది.

Update: 2020-07-01 06:37 GMT

Case filed on Singareni CMD:  తెలంగాణ సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ తో పాటు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, జీఎం ఎస్టేట్స్, కొత్తగూడెం జీఎంపైనా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ కేసు నమోదు చేసింది. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్‌లో గత కొద్ది రోజులుగా రూ.200 కోట్ల డీజిల్ కుంభకోణం జరిగిందని ఓ కార్మిక సంఘం విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన సింగరేణి విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ విచారణంలో సింగరేణి సీఎండీ పాత్ర ఉందని తేలినట్లు సమాచారం.

ఇక పోతే ప్రస్తుతం జీఎం ఎస్టేట్స్‌గా విధులు నిర్వహిస్తున్న సుబానీ శ్రీరాంపూర్ జీఎంగా ఉన్న సమయంలో డీజిల్ కుంభకోణంలో సూత్రధారిగా ఉన్నారని ఆరోపణలు రావడంతో ఆయనపై కూడా సింగరేణి విజిలెన్స్‌ కేసు నమోదు చేసింది. సీఎండీతోపాటు చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి ప్రమేయంతోనే డీజిల్‌ కుంభకోణం నుంచి సుభానిని తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కొత్తగూడెం జీఎం తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక 2017వ సంవత్సరం వరకు అప్పటి ఉద్యోగి ప్రేమ్‌ కుమార్‌, ఫైనాన్స్‌ జీఎం వెంకట రమణ సహకారంతో శ్రీధర్‌ దశల వారీగా రూ.16లక్షలను డ్రా చేశారని సింగరేణి మాజీ ఉద్యోగి సంపత్‌ కుమార్‌ ఆరోపించి కొత్తగూడెం కోర్టులో పిల్ దాఖలు చేశారు. పిల్ ను పరిశీలించిన కోర్టు వెంటనే విచారన జరిపించాలని వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. కాగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.


Tags:    

Similar News