వాచ్మెన్, డ్రైవర్, ఆయా ఇలా ఎవరైనా డాక్టర్ కావొచ్చు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు తమకు తెలిసిన చికిత్స చేయొచ్చు. మహా అయితే ఆ రోగం ముదరుతుంది. అంతకుమించితే ప్రాణాలు పోతాయి. ఇది అచ్చంగా మన సర్కారీ దవాఖాన్లలో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభుత్వాస్పత్రిలో గతంలో చాలాసార్లు వైద్యులు అందుబాటులో లేనప్పుడు ఆస్పత్రి సిబ్బంది చికిత్స చేసిన ఘటనలు కనిపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా వైరా ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.
ఇవాళ ఉదయం గాయాలతో ఆస్పత్రికి వచ్చిన బాధితుడికి అక్కడ ఆయాగా పనిచేస్తున్న మహిళే చికిత్స అందించింది. డాక్టర్లున్నా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా వాళ్లెవరూ బాధితుడిని పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆస్పత్రిలో ప్రథమ చికిత్సకు సంబంధించిన సామాగ్రి లేదని బయట నుంచి తెప్పించుకోవాలని సూచించారు. ఈ విషయమై బాధితుడు, ఆయన తరపు వారు ఎంతగా అడిగినా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
నిన్నటికి నిన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీల సందర్భంగా డ్యూటీ డాక్టర్లు లేకపోవడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీ డాక్టర్లతోనే వైద్యం అందించడంపై సీరియస్ అయిన మంత్రి గైర్హాజరైన సీనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా పరిస్థితిలో ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పేమీ కనిపించలేదు.