56 రోజుల తరువాత రోడ్లపైకి వచ్చిన ఆటోలు.. డ్రైవర్ల ముఖాల్లో విరబూసిన సంతోషం
లాక్ డౌన్ కారణంగా నిన్నటి వరకు వెలవెలబోయిన రహదారులన్నీ ఈ రోజు వాహనాలతో కిక్కిరిసి పోతున్నాయి.
లాక్ డౌన్ కారణంగా నిన్నటి వరకు వెలవెలబోయిన రహదారులన్నీ ఈ రోజు వాహనాలతో కిక్కిరిసి పోతున్నాయి. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా నగరంలో ఆటోలు, క్యాబ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. ఒక ఆటలో ఇద్దరికి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో బస్సులు, క్యాబ్ లు, ఆటోలు మంగళవారం తెల్లవారు జామునుంచే రహదారులపై తిరుగుతున్నాయి. దీంతో 56 రోజులుగా ఉపాధి లేకుండా ఆర్ధికంగా చితికిపోయిన ఎంతో మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల ముఖాల్లో ఒక్క సారిగా సంతోషం విరబూసింది. రద్దీ ప్రాంతాలైన సికింద్రాబాద్, మోహిదీపట్నం, హైటెక్సిటీ, ఉప్పల్, చాంద్రాయణగుట్ట, సంతోష్నగర్, అలియాబాద్, లాల్దర్వాజ ప్రాంతాల్లో ఆటోలు అధికంగా కనిపించాయి.
ఇన్ని రోజులు ఏ పని దొరకక కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని డ్రైవర్లు తెలిపారు. ఇక మరో వైపు దాదాపుగా 56 రోజుల తర్వాత తెలంగాణలో బస్సులు మళ్ళీ రోడ్డేక్కాయి. నిన్న(సోమవారం) సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తూ పలు సడలింపులను ఇచ్చారు. అందులో భాగంగానే బస్సులు ఉదయం ఆరు గంటలకే మొదలవుతాయాని కేసీఆర్ వెల్లడించారు. అయతే ఇందులో కొన్ని కండిషన్స్ పెట్టారు. కచ్చితంగా ఈ కండిషన్స్ ని పాటించాలని లేకపోతే మళ్ళీ కరోనా కేసులు పెరిగితే మళ్లీ పూర్తిస్థాయిలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.