కక్ష సాధింపు చర్యలకు దిగితే సహించేది లేదు
ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని, ఆవిధానం మానుకోక పోతే మళ్ళీ ఆందోళనలను దిగుతామని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని, ఆవిధానం మానుకోక పోతే మళ్ళీ ఆందోళనలను దిగుతామని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి చంపాపేట డివిజన్ పరిధిలోని చంద్రాగార్డెన్లో కేంద్రకమిటీ సమావేశాన్న ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం యూనియన్లు, సంఘాల ఏర్పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కన్నారు. ప్రభత్వం ఈ హక్కులను కాలరాయాలనుకుంటుందని అలా చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
సమ్మెకాలంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బస్సుల సంఖ్యను కుదించడం వలన కార్మికులు నష్టపోతారన్నారు. అంతే కాకుండా డ్యూటీల కోసం బస్డిపోల ముందు పడిగాపులుగాసే అవకాశముందన్నారు. అంతే కాకా బస్సుల్లో ప్యాసింజర్లు ఓవర్లోడ్ అవుతారని దాంతో కార్మికులు పని ఒత్తిడికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై అవగాహన లేని వ్యక్తులను కార్మిక సంక్షేమ సభ్యులుగా నియమించటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి బస్ డిపోలో విధినిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు ఎక్కువై పోతున్నారన్నారు.