Apex Council Meeting on Water Issue: తెలుగు రాష్ట్రాల సీఎంలతో అగస్టు 5న అపెక్స్ సమావేశం

Update: 2020-07-30 10:42 GMT
సీఎం జగన్, సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

Apex Council Meeting on Water Issue: రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించేందుకు తేదీని నిర్ణయించింది. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వచ్చేనెల ఐదవ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ బుధవారం లేఖ రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారని ఈ లేఖలో పేర్కొన్నారు.

ఇరు రాష్ట్రాల సీఎంలు వచ్చే నెల 5న అందుబాటులో ఉంటారా లేదా అన్నది సమాచారం ఇవ్వాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం చేపడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ర్టాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ నదీయాజమాన్య బోర్డులు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటుచేయాల్సిందిగా ఎలాంటి ప్రతిపాదనలను కేంద్రానికి పంపలేదు. రెండు రాష్ర్టాలు గతంలో కూడా కేంద్ర జల్‌శక్తి ఈ భేటీకి సంబంధించి ఎజెండా అంశాలు కోరినప్పటికీ పంపలేదు. అయినా ఎజెండాతోపాటు తేదీని ఖరారుచేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 2016 ఆగస్టులో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో సీఎం కేసీఆర్‌, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో అపెక్స్‌ సమావేశం జరగ్గా ఇది రెండోసారి.

డీపీఆర్‌లే ప్రధాన అజెండా

కేంద్ర జల్‌శక్తి నాలుగు అంశాలతో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి అజెండా రూపొందించింది. 1. కృష్ణా, గోదావరి నదీ జలాలను ఇరు రాష్ర్టాల మధ్య పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయడం, 2.కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు పరిధులను నిర్ణయించడం, 3. కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం. 4. అపెక్స్‌ కౌన్సిల్‌ పరిశీలన, ఆమోదం కోసం కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందజేయడం. ఇందులో డీపీఆర్‌ ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది.

Tags:    

Similar News