సీబీఐ కోర్టుకు సీఎం

Update: 2020-01-10 03:25 GMT
జగన్‌

ఏపీ సీఎం జగన్‌ కాసేపట్లో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరనున్న సీఎం జగన్‌ బేగంపేట్‌కు చేరుకోనున్నారు. అనంతరం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరుకానున్నారు. సీఎం హోదాలో మొదటిసారి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్‌ మధ్యాహ్నం రెండు గంటల వరకు న్యాయస్థానంలోనే ఉండనున్నారు.

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పాలనపరమైన వ్యవహారాలతో బిజీగా ఉన్నందున జగన్ కోర్టుకు గైర్హాజరవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని గతంలో జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం హోదాలో కోర్టుకు హాజరయ్యేందుకు భద్రతా కారణాలు, బందోబస్తు ఖర్చుల నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు.

అయితే, జగన్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని సీబీఐ న్యాయస్థానం తేల్చిచెప్పింది. జనవరి 10 వ తేదీన కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయనతోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. జగన్ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం భద్రత, బందోబస్తు విషయమై ఏపీ ప్రభుత్వం తెలంగాణ పోలీసులకు లేఖ రాయడంతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

అక్రమాస్తుల కేసులో జగన్‌పై 11 చార్జిషీట్లను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. ప్రతి చార్జిషీట్‌లో A-1 నిందితుడిగా జగన్‌ పేరును నమోదు చేశారు. ఇక A-2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా కోర్టులో విచారణకు హాజరుకాకుండా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. సీబీఐ కోర్టు ఆదేశాలతో కోర్టుకు హాజరవుతున్నారు.

అయితే, గతంలో ఇలా అనేక మంది సీఎం హోదాలో కోర్టుకు హాజరైన సందర్భాలున్నాయి. తమిళనాడులో చూస్తే జయలలిత, కరుణానిధి కూడా అనేక సార్లు కోర్టుకు సీఎం హోదాలో హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక ఎవరూ కోర్టు మెట్లు ఎక్కలేదు. తనపై కేసులు ఉన్నా మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నారు. కానీ, ప్రస్తుత సీఎం జగన్ మాత్రం సీబీఐ కోర్టు ఆదేశం మేరకు కోర్టులో బోను ఎక్కేందుకు రెడీ అయ్యారు.

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానుండగా.. మరో కేసులో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా న్యాయస్థానం ఎదుట హాజరవుతున్నట్టు తెలుస్తోంది. జగన్ సీఎం హోదాలో కోర్టుకు హాజరుకానుండటంతో ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. 

Tags:    

Similar News